Thursday, February 21, 2013

చేయెత్తి జై కొట్టు తెలుగోడా










చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా 


సాటిలేని జాతి ఓట మెరుగని కోట 
నివురుగప్పి నేడు నిదురపోతుండాది
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


వీర రక్తపు ధార వారబోసిన సీమ 
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా 
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ 
తాండ్ర పాపయ గూడ నీవోడు   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


కాకతి రుద్రమ్మ మల్లమాంబా మొల్ల 
మగువ మంచాల నీ తోడ బుట్టిన వాళ్లే
వీరవనితల గన్న తల్లేరా 
ధీరమాతల జన్మ భూమేరా   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


నాగార్జునుని కొండ అమరావతి స్థూప
భావాల పుట్టలో జీవకళ పొదిగావు 
అల్పుడను కానంచు తెల్పావు 
శిల్పినంటివి దేశ దేశాల   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు 
మనుషు లన్న మాట మరవబోకన్నాడు 
అమర కవి గురజాడ నీవోడు
ప్రజల కవితను పాడీ చూపాడోయ్   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


రాయలేలిన సీమ రతనాల సీమరా
దాయగట్టీ పరులు దారి తీస్తుండారు 
నోరెత్తి యడగరా దానోడా 
వారసుడు నీవెరా తెలుగోడా   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ 
తుంగభద్రా తల్లి పొంగి పొరలిన చాలు 
ధాన్యరాసులే పండు దేశాన 
కూడు గుడ్డకు కొదవలేదోయ్   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


ఏడుకోట్ల బలగమోయ్ ఒక్కటై మనముంటే 
ఇరుగు పొరుగులోన వూరు పేరుంటాది 
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా 
సవతి బిడ్డల పోరు మనకేలా   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


పెనుగాలి వీచింది అణగారిపోయింది 
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది 
చుక్కాని బట్టరా తెలుగోడా 
నావ దరిజేర్చరా మొనగాడా   
చేయెత్తి జై కొట్టు తెలుగోడా 
గతమెంతో ఘనకీర్తి గలవోడా


రచన::వేములపల్లి శ్రీకృష్ణ

వేములపల్లి శ్రీకృష్ణ (1917 - 2000) ప్రముఖ కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు.
వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు. వీరు రేపల్లె లో ఉన్నత విద్యనభ్యసించి, గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. వీరు ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు పులుపుల వెంకట శివయ్య గారి ప్రోత్సాహంతో 1938లో కమ్యూనిష్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరు 1948లో గుంటూరు జిల్లా కమ్యూనిష్టు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
వీరు 1940 దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుకుగా పాల్గొని గేయ రచనలోను, వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడానికి సహాయపడ్డారు. 1950 దశకంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో "చేయెత్తి జై కొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.
వీరు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మొదట బాపట్ల నియోజకవర్గం నుండి 1952లోను, తరువాత 1962 మరియు 1972 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యులయ్యారు. 1964-65 విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమంలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వీరు 1968 నుండి 1972 వరకు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకత్వం వహించారు. హైదరాబాదులోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఏప్రిల్ 8, 2000 న హైదరాబాదులో పరమపదించారు. మరణానంతరం తన నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.
వికీపీడియా నుండి సేకరించిన విషయాలు  

No comments: