Wednesday, September 05, 2012

తూర్పు వెళ్ళే రైలు--1979





సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
రచన::ఆరుద్ర
గానం::S.P. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి::

వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది
వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది
గాలిలోన తేలే నాదం మేలుకొలుపు పాడింది
మేలుకొలుపు పాడింది
వేగుచుక్క పొడిచింది..........

చరణం::1

కట్టుకున్న మంచు చీర కరిగి జారిపోతుంది
ముసురుకున్న చీకటిలో వెలుగు దూసుకొస్తుంది
కట్టుకున్న మంచు చీర కరిగి జారిపోతుంది
ముసురుకున్న చీకటిలో వెలుగు దూసుకొస్తుంది
దూరంగా నా నేస్తం తూరుపు బండి కూసింది
ఊరంతా మొద్దునిద్రలో ముసుగుతన్ని పడుకుంది
వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది

చరణం::2

ఆశల వెలుగుల తూరుపుబండి దూసుకుపోవాలి
నన్ను తీసుకుపోవాలి
లోకంలోని వెలుగు నీడ లోతులు చెప్పాలీ
రేపటి రూపును లోపలి కళ్ళకు నేడే చూపాలి
రాసిన పాటకు ప్రాణం పోసి
పేరును తేవాలి మంచి పేరును తేవాలి

బ్లాగు మిత్రులకు టీచర్స్ డే ...శుభాకాంక్షలు























టీచర్స్ డే ...

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు… గురుదేవో మహేశ్వరః

మన పూర్వీకులు గురువును సాక్షాత్తూ దేవుళ్లతో పోల్చి పూజించారు. ఆధునిక యుగంలో కూడా అనేకమంది ప్రముఖులు తమను తీర్చిదిద్దిన గురువులను గౌరవించారు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించే గురువులకు మనదేశంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. దానిలో భాగమే సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం.

మంచి ఉపాధ్యాయుడు, గొప్ప తత్త్వవేత్త, రాజకీయ నాయకుడు అయిన ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేడు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. సర్వేపల్లి రాధాకృష్టన్‌కి ఉపాధ్యాయ వృత్తి పట్ల అభిమానం. ‘దేశాన్ని తీర్చి దిద్దే మేధావులు ఉపాధ్యాయులే’ అని ఆయన నమ్మేవారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒక సారి కొంతమంది స్నేహితులు, విద్యార్థులు కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరారు. అప్పుడు ఆయన తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లను గౌరవిస్తే మంచిదని సూచించారు. ఆ తర్వాత 1962 నుంచి యేటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. విద్యార్థులకు గురువుల పట్ల ఉన్న గౌరవమర్యాదల కారణంగానే గురుపూజోత్సవం ఇంత ఆదరణకు నోచుకుంది. గురుపూజోత్సవం నాడు ఎవరి గురువులను వాళ్లు తమకు తోచిన రీతిలో సత్కరిస్తూ వేడుకలు జరుపుకుంటారు.
http://ecoastalworld.com/teachers-day/...ఈ సైట్ నుండి స్వీకరించినది ....
ఈ సందర్భంగా సమాజానికి ఆణిముత్యాల లాంటి శిష్యులను అందించిన కొందరు గురువులనైనా తలుచుకోవడం సముచితం. వీరనారి ఝాన్సీ రాణి పేరు చెప్పకుండా భారత స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడడం అసంభవం. అసలు ఝాన్సీ అన్న పదమే వీరత్వానికి పర్యాయ పదంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఝాన్సీలక్ష్మీబాయి గురువు తాంతియా తోపే. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తాంతియా తోపేని ఆమె నిరంతరం అభిమానించింది, గౌరవించింది. తన శిష్యురాలి వల్ల ఆయన చరిత్రలో చిరస్మరణీయుడయ్యాడు.

చికాగో సభలో తన ప్రసంగంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసి, ప్రపంచ దృష్టిని భారతదేశం వైపు మళ్లించిన స్వామి వివేకానంద తాను ఒక మంచి శిష్యుడనని చాటుకున్నాడు. ఆయన గురువైన రామకృష్ణ పరమ హంసకు తగిన గౌరవాన్ని అందించాడు.
http://ecoastalworld.com/teachers-day/...ఈ సైట్ నుండి స్వీకరించినది
గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఆయన జీవితచరిత్ర ‘‘వింగ్స్ ఆఫ్ ఫైర్’’ లో తనను ప్రోత్సహించిన గురువుల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఆ విధంగా తన గురువులను గౌరవించాడు. అలా ఎంతో మంది శిష్యులు మరెందరో గురువుల పేరును నిలబెడుతూనే ఉన్నారు. తమ శిష్యులను సన్మార్గంలో నడిచేటట్లు వెన్నుతట్టి ప్రోత్సహించి, జీవితంలో ఎంతో సాధించడానికి స్ఫూర్తినిచ్చిన గురువులందరికీ ఈ ఒక్కరోజే కాదు జీవితాంతం గౌరవ మర్యాదలు దక్కాల్సిందే.