Wednesday, May 22, 2013

వేటూరి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా స్వరాంజలి

















Raasina vaaru Kavita Chakra



వేటూరి!!
ఈ మాట వింటూఎనే గుండెలో ఒక ఝలక్!
పాటల మాంత్రికుడు.. పైగా భాషా కోవిదుడూ..
వెరసి అభినవ శ్రీనాథుడు మన వేటూరి.
రసరమ్య హృదయంలో ఒక వసంత గీతిక..
ప్రకృతిలో అందాలన్నీ వీరి అక్షరాల ఊపిరితో పురుడు పోసుకున్నాయి!
అందుకేనేమో మరి! వీరి పదాల లాలిత్యంతో గోదారమ్మ వెన్నెల పైటేసింది.
వీరి కలం ఝుళిపించగానే సినీ గీతరచనా సముద్రంలో ఉండుండీ ఒక అలజడి..
ఉన్నట్టుండీ భావాక్షరాలు అద్భుత గీతికలయ్యాయి!
ఆ గీతాలే హాయి వింజామరలై ఓలలాడించాయి.
ఒక మలయమారుతం చల్లగా వీచి నిదురిస్తున్న హృదయాల్ని తాకింది!
వేటూరి పాట వింటోంటే... యెక్కడో ఆకాశంలో కాచే వెన్నెల యెదలో కాచి, కన్నుల్లో వెలిగింది..
తన అక్షరాల సుమాలతో సాహిత్యానికి పదార్చన చేసిన భాషార్చకులు.
మన పాటల పూదోట పూజారి వేటూరి కల వనంలో...ఎన్నో 'సంధ్యారాగపు సరిగమలు..' 'వెన్నెల్లో గోదారి అందాలు.. ' వొంపుల వైఖరిలో సొంపుల వాకిళ్ళూ తన సిరా రచించిన అక్షర కాంతి కి నెలరాజును సైతం తారలకేసి కాకుండా వీరి పదజాల మంత్రజాలానికి ముగ్ధుడై తన సిరా లో ఒదిగిపొయాడు! కలానికి ఒక వైపు అందాల ఆరబోత అయితే.... మరో వైపు పదునుకొస్తే...
అమ్మతనాన్ని, ఆలి విలువనూ, అమ్మాయి ముగ్ధత్వాన్నీ, అమాయకత్వాన్నీ మృగాళ్ళ విషపు కోరల కింద బలైన తీరు 'రక్తాశృలు చిందిస్తూ రాస్తున్న శోకంతో..' అంటూ మాతృ హృదయ నిర్వేదాన్ని, మరో మహా భారతాన్నే ఒక్క పాటలో రచించిన జ్ఞాని!! వారి కలానికి మరో పదును చూస్తే..
ఓంకార నాదాన్ని సందానం చేసి, రాగం తానం పల్లవీ విశిష్టతను తెలియజెసే..'రాగాలనంతాలు నీ వెయి రూపాలు భవ రోగ తిమిరాల....' అని చాటిన వ్యక్తి సుందర రామమూర్తి!
తన గీత రచనతో.. పరమేశ్వరిడిని భక్తితో 'శంకరా నాదశరీరాపరా వేదవిహారపరా..' అని అర్చించినా.. రాముడి పై భక్త పారవశ్యం పొందినా వేటూరి పద సంపద కే చెల్లయింది.... ఒక్కటా రెండా.. పదులా వందా..
ఒక్క భావమా.. ఒక్క వేదనా.. ఒక సరసమా.. ఒక విరహమా.. ఒక ప్రేమా, ఒక వైరాగ్యమా.. యెన్నని, యెన్నెన్నని చెప్పగలం, యెంతని పొగడగలం.. కాదేదీ వేటూరి భావాక్షారలకనర్హం అన్నట్టూ..
పదాలతో తీరొక్క ప్రయోగం చేస్తూ భాషతో ఆడుకుంటూ తన రచనలతో అలుపెరగని సేవకుడై భాషకు ఊడిగం చేసారు. .అందుకేనేమో ముచ్చట పడి భాషే వీరి కలానికి బానిసైందంటే అతిశయోక్తి కాదేమో!
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించారు.
సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద, శిష్యరికం చేశారు.
ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. అందుకేనేమో అటు సమాజం పట్ల అవగాహన, వృత్తిలో ఉండే చురుకుదనం ఇటు వంశీకులు కూడా పాండిత్యంలో ఉండటం వల్ల భాష పై పట్టు వంట బత్తాయి!
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు.
సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని తన శైలిలో అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలుఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించి, తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ అయ్యారు.
ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. అయితే, ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం.
కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
అయితే అప్పట్లో పాట రాయడమంటే దానికి ప్రత్యేకమైన మూడ్, సమయమూ ఉండాలన్న పద్దతి ఉండేది. ఈ పద్దతికి వేటూరి పూర్తి స్వస్తి చెప్పి, "పాట రాయాలని మనసు ఉంటే చాలు" అని పాట పట్ల తన శ్రద్ద, అంకితభావాన్ని చాటారు.
ఇక వీరి చమత్కార ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే...
వీరి ఆగమనానికి ముందు ఆత్రేయ గారు మంచి లీడ్లో ఉన్నారు. ఆత్రేయ గారికి సెంటు నూనె రాసుకునే అలవాటు ఉండేది. వారు వస్తున్నారని ఆ పరిమళమే తెలిపేది. ఒకసారి సినిమా సెట్లో వేటూరి ఆత్రేయగారితో "గురువు గారూ యీ రోజు నూనె 'రాసుకోలేదా'' అని చలోక్తి విసిరారు. దాని జవాబుగా ఆత్రేయ గారు "నువ్వు 'రాయడం మొదలెట్టావుగా నాయనా, అందుకే నా 'రాయడం' తగ్గించేసానూ' అని నవ్వారట!
అంతే కాదు.. శంకరాభరణం పాట 'దొరకునా ఇటువంటి సేవా రాసేటప్పుడు వేటూరి కాస్త అస్వస్థతో హాస్పిటల్ బెడ్డు పై ఉన్నరట. "నీ పద రాజీవ నిర్వాణ సోపానమధిరొహణము సేయు ద్రోవ" అన్న పెద్ద వాక్యం రాసిస్తే అది చూసి మహదేవన్.."ఇది పాడినవాడు పోతాడయ్యా..'' అంటే వెటూరి గారు..''యెటూ యీ పాట పాడుతూ శంకర శాస్త్రి పోవాలి గదయ్యా(ఈ సినిమాలో ఈ పాట పాడగానే శంకరశాస్త్రి మరణించే సన్నివేషం) అని చమత్కరించారట.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన..., నాదవినోదము....అని చెప్పేవారు.
జీవితపు చరమాంకం వరకూ అలుపెరగకుండా సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. గుండెపొటుతో బాధ పడి 2010 మే 22న మరణించారు!!!!!!!!!!!
ఉప్పొంగుతున్న గీత రచనా గోదారిలో ఉన్నట్టుండీ స్థబ్దత!
పాటల మరీచికలో వీచే గాలి ఆగిపోయింది.
పదాలతో మిన్నంటే ఆనందపు అల అక్కడే ఆగిపొయింది!
తన ముద్దు బిడ్డను కోల్పొయి కళామతల్లి, తెలుగు సాహిత్యమ్మ కంట తడి పెట్టుకున్నాయి. అయినా వారి పేరు చిరస్మరణీయంగా ప్రకృతిలో లీనమైంది.
'మమతలన్నీ మౌన గీతం..వాంచలన్నీ వాయు లీనం...'' అన్నా..'ఈ మజిలీ మూడునాళ్ళే ఈ జీవ యాత్రలో.. ఒక పూటలోనే రాలు పువ్వులెన్నో..'' అన్నా...నరుడి బ్రతుకు నటనా ఈశ్వరుడి తలపు ఘటనా ఆ రెంటి మధ్య నడుమా నీకెందుకింత తపనా..అని మనని తన పాటతో ఓదార్చినా..
ఒక వెన్నెల్లో, ఒక గొదావరి నురగలో, యమునా తీరంలో, రాగాల పల్లకిలో , పడతుల అందాల వర్ణనలో , దైవ భక్తిలో... మారుమ్రోగుతూనే ఉంది, ఉంటుంది....
వారి మాటల్లోనే చెప్పకనే చెప్పారు..వేణువై వచ్చాను భువనానికీ గాలిని పోతాను గగనానికీ....
అవును!
మీరు లేని పాటల తోటలో రంగు పూలు మాత్రమే మిగిలాయి! ఆ పారిమళ పరవశమేదీ
kavitagaaru chaalaa thanks andii veturi gaari gurinchi vipulangaa raasinanduku 

No comments: